సోమవారం నుంచి 4.0 అమలు.. కొత్త నిబంధనలు ఏంటీ?

సోమవారం నుంచి 4.0 అమలు.. కొత్త నిబంధనలు ఏంటీ?
X

ఆదివారంతో మూడో విడత లాక్ డౌన్ ముగియనున్నది. దీంతో నాలుగో విడత లాక్ డౌన్ కు కేంద్రం రెడీ అవుతోంది. ఆదివారమే కొత్త నిబంధనలను ప్రకటించనుంది కేంద్రం. దీంతో ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి మరిన్ని సడలింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలను పునరుద్ధరించే అవకాశం ఉంది. జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. హాట్ స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 ప్రారంభం కానుంది. ఈ లాక్‌డౌన్‌లో ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చు. ఏ రాష్ట్రమూ లాక్‌డౌన్‌ పూర్తి ఎత్తివేతను కోరుకోవడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేయిదాటిపోవచ్చని అన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాలకు మరిన్ని సడలింపులను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా వెసులుబాట్లు వుండాలని, ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని పలు రాష్ట్రాలు ప్రధానమంత్రిని కోరుతున్నాయి.

నిత్యావసరేతర వస్తువులను విక్రయించేందుకు సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌కు ఎలాంటి అనమతి ఉండదు. వివిధ వస్తువుల హోం డెలివరీకి అవకాశం ఉంటుంది. ఆంక్షలతో రవాణా సదుపాయాలు పునరుద్ధరించే అవకాశం ఉందని, రోడ్డురవాణా సంస్థల బస్సులు పరిమితంగా తిరుగుతాయని తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Tags

Next Story