వజ్రం… ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజం… ఒక్క డైమండ్ ఉంటే రాజాలా బతికేయొచ్చు అంటుంటారు… అలాంటి వజ్రాల గనులు ఎక్కడో కాదు మన తెలంగాణలో ఉన్నాయని ఓయూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది… కృష్ణమ్మ పరుగుల కింద మిళ మిళ మెరిసే వజ్రాల గనులున్నట్టు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో గుర్తించినట్టు జియోలాజికల్ శాస్త్రవేత్తలు తెలిపారు… కృష్ణా, మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నాయంటున్నారు…
నల్లమల అడవుల్లో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మహబూబ్నగర్ జిల్లా లింగాల్ మండలాన్ని ఆనుకొని ఉండే నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఇనుప ఖనిజంతో పాటు లోపలి పొరల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని GSI ఇటీవల నివేదిక సమర్పించింది. వాస్తవానికి నల్లమలలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని దశాబ్దాల కిందటే పలు అంతర్జాతీయ సర్వే తేల్చాయి… వాటికి అనుబంధంగా తాజా నివేదికలు నిక్షేపాలపై మరింత దృష్టిసారించేలా చేస్తున్నాయి…
2013లో కృష్ణా పరివాహక ప్రాంతంలోని భూతత్వంపై పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు నల్గొండ జిల్లాలోని రామడుగు, సోమవారిగూడెం, వట్టికోడు, యాచారం ప్రాంతాల్లో, మహబూబ్నగర్ జిల్లాలో వజ్రాల గనులు ఉండే అవకాశాలు ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ఈమేరకు అధ్యయన వివరాలతో కూడిన పరిశోధనా పత్రాన్ని ఎన్జీఆర్ఐకు చెందిన ‘ఇండియన్ జియో ఫిజికల్ యూనియన్’ అంతర్జాతీయ జర్నల్ ఇటీవల ప్రచురించింది.