పరిపాలనలో దూకుడు పెంచిన సీఎం జగన్‌

Update: 2019-06-01 04:13 GMT

ప్రమాణ స్వీకారం అవగానే పరిపాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సమీక్షలు, బదిలీలు, నియామకాలు, అవసరం లేని ఉద్యోగాలపై కొరడా ఝులిపిస్తూ.. వరుస నిర్ణయాలతో తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి శాఖల వారిగా సమీక్షలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌.

ఈ ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష చేస్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై చర్చించనున్నారు. వరుసగా ఆరు రోజుల పాటు జగన్‌ రివ్యూలు కొనసాగనున్నాయి. ఈ నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. 4న వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తారు. ఇక 6వ తేదీన సీఆర్డీఏపై రివ్యూ ఉంటుంది.

ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నభోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్‌, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ రివ్యూ చేశారు. మధ్యాహ్నభోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. ఈ పథకాన్ని వైఎస్సాఆర్‌ అక్షయపాత్రగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు మధ్యాహ్నంభోజనం అందించే ఏజెన్సీలకు గౌరవవేతనం వెయ్యి నుంచి 3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అటు… సీఎంవోలో గత ప్రభుత్వంలో సిఫార్సుల ద్వారా నియామకం జరిగినట్లు భావిస్తున్న 42 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుని పాలనలో తనదైన ముద్ర వేశారు జగన్.

Similar News