ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో మొదటిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న భారత్ ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. 1983, 2011లో ప్రపంచక్పలు సాధించిన భారత జట్టుకు మరోసారి ట్రోఫీ అందించాలన్న కసితో కెప్టెన్ విరాట్ ఉన్నాడు. అయితే జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేకపోయినా అప్పట్లో ఎంఎస్ ధోనీ చాంపియన్ జట్టులో ఉన్న ఆటగాళ్ల స్థాయి వేరు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, జహీర్, హర్భజన్ ఇలా అపార అనుభవం కలిగిన ఆటగాళ్లతో స్వదేశంలో భారత్ విజేతగా నిలవగలిగింది.
అయితే ఈ విరామంలో కోహ్లీ ఆటగాడిగా ఎంతో ఎత్తుకు ఎదగగా ధోనీ విలువైన సలహాలతో అతడికి అండగా నిలవనున్నాడు. ఓపెనింగ్లో రోహిత్, ధావన్.. వన్డౌన్లో విరాట్.. నాలుగో నంబరులో రాహుల్ రానున్నారు. తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవచ్చు. ఐసీసీ టోర్నమెంట్స్లో అద్భుత రికార్డు కలిగిన భారత జట్టు అదే జోరును ఇంగ్లండ్ గడ్డపై కూడా చూపాలనుకుంటోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తామాడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైంది. దీనికి తోడు కీలక ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును వెంటాడుతున్నాయి.