మాంచెస్టర్ లో వర్షం ఆగిపోయింది. దీంతో ఏ క్షణమైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 4 వికెట్లకు 305 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రాహుల్, రోహిత్శర్మ మంచి ఆరంభాన్నిచ్చారు. రాహుల్ హాఫ్ సెంచరీ చేసి ఔటవగా... రోహిత్శర్మ సెంచరీతో రెచ్చిపోయాడు. 85 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న రోహిత్ 140 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత కోహ్లీ, పాండ్యా ధాటిగా ఆడడంతో స్కోర్ 300 దాటింది. చివర్లో పాండ్యా , ధోనీ కూడా ఔటవడంతో భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ 276 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధిస్తే... కోహ్లీ 222 ఇన్నింగ్స్లలోనే అందుకున్నాడు. అటు రోహిత్శర్మ అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు. పాక్పై మూడు సిక్సర్లు కొట్టిన రోహిత్ , ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ 358 సిక్సర్లు కొడితే... ధోనీ 355 , యువరాజ్సింగ్ 251 , గంగూలీ 247 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.