ఆ అన్నదాత విత్తులు నాటేందుకు సిద్ధమయ్యాడు. ఇందు కోసం దుక్కి దున్నడం మొదలు పెట్టాడు. ఇంతలోనే విద్యుత్ తీగలు యమపాశంగా మారాయి. క్షణాల్లోనే ఆ అన్నదాతను కబలించేశాయి. భూమిలో బంగారం పండించే ఆ భూమి పుత్రుడు విద్యుత్ తీగలు తాకి నేలకొరగడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విద్దోలిలో... రవి అనే యువ రైతు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. పొలం దున్నే కాడెడ్లను కాపాడబోయి తాను మృత్యువాత పడ్డాడు. చేలల్లో విగత జీవిగా మారిన అన్నదాతలను చూసిన గ్రామస్తులు చలించిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు.
అన్నం పండించే అన్నదాతకే ఎందుకు ఈ కష్టం అని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. గత కొన్ని రోజులుగా చేలల్లో విద్యుత్ తీగలు ఎంతో మంది బలి తీసుకుంటున్నారు. విద్యుత్ అధికారుల నిర్వహణ లేకపోవడంతో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చివరకు అవి రైతుల పాలిట ఇలా మృత్యుపాశాలుగా మారుతున్నాయి.