ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ ఔట్‌..

Update: 2019-07-06 01:21 GMT

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొని 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ న్యూజిలాండ్‌కే మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో పాక్‌ జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ 100 పరుగులు, బాబర్ ఆజం 96, ఇమాద్ వాసిమ్ 43 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ 5 వికెట్లు తీసి పాక్ పరుగుల వరదకు కళ్లెం వేయగా, మహ్మద్ సైఫుద్దీన్ 3 వికెట్లు తీశాడు.

పాక్‌ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ 64 రన్స్‌ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. 35 పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించిన షాహిన్‌ ఆఫ్రిదికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో మొత్తం 11 పాయింట్లు సాధించినా మైనస్ రన్ రేట్ కారణంగా పాక్ సెమీస్‌కు చేరలేకపోయింది. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.

Similar News