హాంకాంగ్లో ప్రజాగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పదకొండు వారాలుగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జోరు వానలోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. నిరసనలు విరమించకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా ఉద్యమకారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం హాంకాంగ్ ఎయిర్పోర్టును దిగ్బంధించిన నిరసనకారులు.. ఆ తర్వాత మరింత తీవ్రతరం చేశారు. నిత్యం వేలాదిగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇక ఆదివారం భారీ వర్షంలోనూ గొడుగులతో శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు. విక్టోరియా పార్కు నుంచి చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలకు సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ నేతృత్వం వహించింది. హాంకాంగ్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఆందోళనలు చేపడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.