వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రాజధాని అమరావతికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ఆయన.. వరద వస్తే అమరావతి మునిగిపోతుందని మంత్రులు చెప్పడం సరికాదన్నారు. రాజధానికి కూడా సామాజిక రంగును పులమడంపై సుజనా మండిపడ్డారు.
అమరావతిలో తనకు భూములు ఉన్నాయని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు సుజనా చౌదరి. అమరావతిలో తనకు అంగుళం భూమి ఉన్నా నిరూపించాలని సవాల్ చేశారాయన. అసలు ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటే వైసీపీ నేతలకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు.
అటు పోలవరంపైనా వైసీపీ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు సుజనా. పోలవరంపై రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్న ఆయన.. పోలవరంపై మళ్లీ రివర్స్ టెండరింగ్కు వెళ్లడం సరికాదన్నారు. పోలవరంపై ఇష్టానుసారం వెళ్తామంటే కుదరదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతుందన్నారు సుజనా చౌదరి. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.