సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియా సంస్థల్లో పనిచేశారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా ఉన్నారు. అలాగే టీవీ9, సాక్షి టీవీ, యువర్ స్టోరీ మీడియాలో ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు హిందీ పుస్తకాలను కూడా రచించారాయన. ఇకపై ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా అరవింద్ యాదవ్ విధులు నిర్వహించనున్నారు.