తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు ఇటీవల కురిసిన వర్షాలతో సాగు ప్రారంభించారు. అయితే.. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాయవలసి వస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో ఎరువుల నిల్వలు లేకపోవడంతో అన్నదాతలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 92,282 హెక్టార్లలో రైతులు పంట సాగు చేస్తారు. అధికారుల అంచనాల ప్రకారం రైతులకు 14,765 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకు రైతులకు కేవలం 11 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 3,700 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందించవలసి ఉంది. దీంతో.. రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.