Kodi Kathi Case: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను..

జగన్‌ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన

Update: 2024-04-28 06:30 GMT

వైఎస్సార్‌సీపీ అదినేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఎస్సీ కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఠాణేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను టీడీపీ పార్టీలోకి చేరారు. తన అన్న సుబ్బరాజు కుటుంబంతో పాటు గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాలు కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు శ్రీను తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతు లభించినా తాను అభిమానించిన వైఎస్సార్‌పీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని అన్నారు. తాను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలేనని అన్నారు.'నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గత ఐదేళ్లగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో పలికే పలుకులను జనం నమ్మటం లేదు' అన్నారు శ్రీను.

జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు శ్రీను. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాను చేసిన ప్రయత్నం ఫలించినా తన జీవితం మాత్రం ఐదేళ్లు కటకటాల వెనక మగ్గిపోయిందన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల వారు తనకు సంఘీభావం తెలిపారన్నారు. కానీ, తాను అభిమానించిన వైఎస్సార్సీపీ పార్టీ నుంచి మాత్రం ఏ ఒక్కరు సహకరించలేదన్నారు.

Tags:    

Similar News