విజయవాడ దుర్గగుడిలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. పులిహోర తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. దసరా వేడుకలకు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. ప్రసాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. 50 మంది సిబ్బందిని నియమించారు. 40 ఫుల్ గ్యాస్ సిలిండర్లు తెప్పించి.. ప్రసాదాల తయారీ చేపట్టారు. అయితే.. గ్యాస్ లీక్ కావడం కలకలానికి దారితీసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. గ్యాస్ బంద్ చేశారు. దీంతో.. పెను ప్రమాదం తప్పినట్టయింది.
ముందస్తు పర్యవేక్షణ లేకపోవడం వల్లే గ్యాస్ లీకయినట్టు భావిస్తున్నారు. పులిహోర తయారీకి వెంటనే గ్యాస్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత గ్యాస్ పైప్లైన్కు మరమ్మత్తులు చేశారు. విషయం తెలుసుకున్న దుర్గగుడి ఈవో సురేష్బాబు.. గ్యాస్ లీకైన పైప్లైన్ను పరిశీలించారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Also watch :