నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ దొంగను గ్రామస్తులు కొట్టి చంపారు. మాక్లూర్ మండలం ధర్మోరలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లికి చెందిన గంగాధర్ అనే యువకుడు మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడ పని ఉంటే అక్కడ నివసించే గంగాధర్ ప్రస్తుతం నిజామాబాద్ మండలం ఖానాపూర్లో నివసిస్తున్నాడు. అయితే.. గంగాధర్ ఓ వైపు మేస్త్రీ పని చేస్తూనే మరో వైపు రాత్రి వేళ దొంగతనాలపై దృష్టి పెట్టాడు. గంగాధర్పై ఇప్పటి వరకు 9 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు.
సోమవారం సాయంత్రం పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంగాధర్ ధర్మోరలోని మహలక్ష్మి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గంగాధర్ను పట్టుకుని చితకబాదారు. అపస్మారక స్థిలో ఉన్న గంగాధర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మృతుడు గంగాధర్కు భార్య, రెండు నెలల పాప ఉంది. దొంగతనం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ కొట్టి చంపుతారా అని గంగాధర్ కుటుంబసభ్యులు వాపోతున్నారు. గ్రామస్తులపై హత్య కేసు నమోదు చేయాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.