శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలు అదృశ్యం మిస్టరీగా మారింది.. మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చిన లక్ష్మీ భవానీ అనే యువతి ఇంటికి చేరకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికురాలి అదృశ్యం ఎయిర్పోర్టులో కలకలం రేపుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీ భవానీ కొంత కాలం క్రితం మస్కట్ వెళ్లింది.. గతనెల 10న మస్కట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన లక్ష్మీ భవానీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది.. అప్పటి వరకు ఇంట్లో వారితో మాట్లాడిన లక్ష్మీ.. ఎయిర్పోర్టుకు రాగానే ఆమెతో కమ్యూనికేషన్ మిస్ అయింది.. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అప్పటి నుంచి తెలిసిన వారినల్లా లక్ష్మీ గురించి సమాచారం అడుగుతున్నారు.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఆందోళనలో ఉండిపోయారు. పదిరోజులు దాటిన ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో చివరకు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్టులో సీసీ కెమెరా దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.