Accident : పుట్టు వెంట్రుకలు తీసిన రోజే..లారీ ఢీకొని బాలుడు మృతి

Update: 2024-04-29 06:10 GMT

పుట్టు వెంట్రుకలు తీసిన రోజే చిన్నారి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్​ వద్ద హైవేపై ఆదివారం రాత్రి లారీ ఢీకొని ప్రణయ్(4) చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన దొంతుల స్వప్న, రాము దంపతులు ఆదివారం తమ కొడుకు ప్రణయ్ పుట్టు వెంట్రుకలు తునికి నల్ల పోచమ్మ ఆలయం వద్ద తీసుకువచ్చారు.

కార్యక్రమానికి వచ్చిన బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రణయ్ తో పాటు మరో నలుగురు బంధువుల పిల్లలు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ప్రణయ్​ అక్కడికక్కడే చనిపోయాడు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టు వెంట్రుకలు తీసుకువచ్చిన రోజే ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రంజిత్ కుమార్ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News