TS : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Update: 2024-04-29 06:02 GMT

 యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే, దర్శనం, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.

కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.59,34,193 ఆదాయం సమకూరింది.

అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.20,93,350, వీఐపీ టికెట్ల ద్వారా రూ.9.60 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.5,71,500, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,06,250, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,90,400, యాదరుషి నిలయం ద్వారా రూ.2,62,138, కల్యాణకట్ట ద్వారా రూ.1.85 లక్షలు, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.1,42,096 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.

Tags:    

Similar News