పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరగనుంది.. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రెండో సమావేశం ఇది. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగులను పే స్కేల్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంపై పాలక మండలి చర్చించనుంది.. ఇందులో స్థానికులకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఖాళీలపై చర్చ జరగనుంది.
ఇక టీటీడీ విద్యాసంస్థల్లో హాస్టల్ వసతి నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రజా సంబంధాల అధికారిని ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమించే అజెండాకు ఆమోదం తెలుపనుంది. ప్రజా సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ఓఎస్డీ జీతం పెంపునకు పాలక మండలి సమావేశంలో ఆమోదముద్ర వేయనుంది. గరుడ వారధిపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో డిప్యూటీ లా ఆఫీసర్గా విధులు నిర్వహించిన వెంకటసుబ్బ నాయుడును ఎస్డీ లా విభాగానికి నియమించే అవకాశం కనిపిస్తోంది.. ఇక ఎస్వీ ఆయుర్వేదిక్ కాలేజీలో పీజీ కోర్సులకు, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించే అజెండాపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు.