మీడియా ప్రతినిధుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తంచేసింది. జీవో నెంబర్ 2430 అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ఏపీ సర్కార్ చర్య భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార-పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారాయన.
తప్పుడు వార్తలు రాస్తే.. కేసులు పెట్టి, లీగల్ చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అనుమతినిస్తూ.. అక్టోబర్ 30న ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. ప్రజాస్వామ్యవాదులు, మీడియా సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తప్పుడు వార్త వస్తే.. ఖండన కోరవచ్చని.. అప్పటికీ పొరపాటు సరిదిద్దకపోతే.. ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయవచ్చని గుర్తు చేస్తున్నారు. అలాకాకుండా.. కేసులు పెడతామనడం.. బెదిరింపులతో కలానికి సంకెళ్లు వేసే ప్రయత్నమని విమర్శించారు. గతంలోనూ.. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు.. తప్పు తెలుసుకుని వెనక్కు తగ్గారని గుర్తుచేశారు.