విశాఖ జిల్లా జి.మాడుగులలో దారుణం చోటు చేసుకుంది. డబ్బు దొంగిలించారనే అనుమానంతో 24 మంది చిన్నారులను అతి దారుణంగా కొట్టిందో టీచర్. జి.మాడుగుల మండలం మత్స్యపురం ప్రభుత్వ పాఠశాల టీచర్ ఎలిజిబెత్ రాణి నిర్వాకం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎలాంటి విచారణ జరపకుండానే అందరినీ గదిలో నిర్బంధించిన టీచర్.. వారిపట్ల కర్కశంగా ప్రవర్తించింది. చేతికి దొరికిన వస్తువుతో వారిని కొట్టింది. టీచర్ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
దెబ్బలతో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు జరిగిన విషయమంతా వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారంతా స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు మత్స్యపురం స్కూల్ టీచర్ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా విశాఖ ఏజెన్సీ డీఈవోను నియమించారు.