తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. స్థానిక అన్నమయ్య భవన్లో టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ప్లాస్టిక్ నిషేధం అంశంపైనే చర్చించారు. వచ్చే నెలలోపు తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చారు. భక్తులు టీటీడీ జలప్రసాదాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తం మూడు దశల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఏఈవో సూచించారు. తొలిదశలో టీటీడీ కార్యాయాల్లో.. రెండవ దశలో కాటేజస్, వసతి సముదాయాల్లో నిషేధించనున్నారు. మూడోదశలో హోటల్స్, దుకాణాల్లో నిషేధం విధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఇక తిరుమల కొండ మీదకు ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ రాకుండా అలిపిరిలోనే వాటిని నిలువరించే విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను నెలరోజుల లోపు పూర్తిచేస్తామని అన్నారు. అటు సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డూ టోకెన్స్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించామని.. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దర్శనానికి వెళ్లిన భక్తులు వైకుంఠం 1లో స్కాన్ చేసుకుంటేనే శ్రీవారి మహా ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని ఏఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.