మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొలిక్కి వస్తున్నట్టే కనిపిస్తోంది. ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ-కాంగ్రెస్ ఒప్పుకోవడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. డిప్యూటీ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనకు ఆ రెండు పార్టీలు అంగీకరించాయి. CM పదవితోపాటు మంత్రి పదవుల్లో సింహభాగం శివసేనకే దక్కనున్నాయి. శివసేనకు 16, NCPకి 14, కాంగ్రెస్కి 12 మంత్రి పదవులు ఉండేలా ఒప్పందం కుదిరింది. స్పీకర్ పదవి కాంగ్రెస్కు దక్కనుంది. డిప్యూటీ స్పీకర్ శివసేనకు ఇస్తారు. అలాగే.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన కనీస ఉమ్మడి కార్యాచరణపై కూడా 3 పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. ఈ వారాంతానికి ఈ కసరత్తు కొలిక్కి వస్తే.. సోమ, మంగళవారాల్లో దీనిపై ప్రకటన చేయనున్నారు.
పారదర్శకనమైన పాలన అందించేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం సిద్ధం చేస్తున్నామని మాజీ సీఎం పృద్వీరాజ్ చవాన్ చెప్తున్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇతరత్రా అంశాల ఆధారంగా 40 పాయింట్లతో CMP సిద్ధం చేశారు. దీన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, NCP చీఫ్ శరద్ పవార్తోపాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టే. ఇక సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఆ పార్టీ నుంచి ఎవరు దీన్ని చేపడతారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.