ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ తీరుపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. గురువారం 5,100 రూట్ల ప్రైవేటీకణపై విచారణ చేపట్టింది. పర్మిట్లపై కేబినెట్ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. అయితే కేబినెట్ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది హైకోర్టు. దీనిపై వివరణ ఇచ్చిన అడ్వకేట్ జనరల్.. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. అసలు ఆర్టీసీ నోటీస్లో పెట్టకుండా ప్రైవేటీకరణపై నిర్ణయం ఎలా తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని కోర్టు నిర్ణయించింది. అనంతరం ప్రైవేటీకరణ పిటీషన్ సరిగా లేదని అభిప్రాయ పడిన కోర్టు.. తదుపరి విచారణకు సోమవారానికి వాయిదా వేసింది. అంతవరకు ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది న్యాయస్థానం.
మరోవైపు .. 5100 రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ, భవిష్యత్ కార్యచరణపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్ ఎస్కే జోషి, అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అడ్వకేట్ జనరల్.. సీఎం కేసీఆర్కు వివరించారు. మొత్తానికి ప్రభుత్వం.. ఆర్టీసీ విషయంలో కఠినంగా ఉండాలనే నిర్ణయించినట్లు తెలుస్తోంది.