పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తుంటే క్రూర మృగాలు కనిపిస్తే ఆ భయం మాటల్లో చెప్పలేనిది. దేశంలోని అనేక పురాతన ఆలయాలకు వెళ్లాలంటే అడవి మార్గంలో వెళ్లాల్సిందే. సెక్యూరిటీ పరంగా సరైన జాగ్రత్తలు లేకపోవడంతో ఇప్పటికీ వన్య మృగాలు భక్తుల కాలిబాటలో కనిపించి భయపెడుతున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవాలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. శిఖరేశ్వరం చెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.
ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటి సంచరించిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎలుగును పట్టుకుని కారడవిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.