భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం పీఎస్ఎల్వీ-సి-47 రాకెట్ను నింగిలోకి పంపేందుకు సిద్దమైంది. మంగళవారం ఉదయం 7.38 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. బుధవారం ఉదయం 9 గంటల 28 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి ఎగరనుంది. మన దేశ సరిహద్దుపై నిఘా వేసే అత్యంత ఆధునిక ఉపగ్రహం కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. కార్టోశాట్-3, హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది. మిగిలిన 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి.
వాస్తవానికి సోమవారమే PSLV-C-47 ప్రయోగం జరగాల్సి ఉంది. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో 4 దశల రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక.. అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్ఎల్వీ రాకెట్లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో ఇబ్బంది వచ్చింది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈనెల 23న ప్రాబ్లెమ్ను సాల్వ్ చేశారు. శనివారం ఉదయం పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు.