ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్న బాధితులకు ఆర్ధిక సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి రోజుకు 225 రూపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో పనిచేస్తున్నామన్నారు సీఎం జగన్.
మంచి పాలన అందిస్తుంటే.. కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం అన్నారు. తన మతం, కులం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని జగన్ విమర్శించారు .
ఆరోగ్యశ్రీతో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్న జగన్.. 2 వేల వ్యాధులకు వర్తింప చేస్తామన్నారు. జనవరి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. కాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామని... జనవరి 1 నుంచి కీమోథెరపీని ఉచితంగా అందిస్తామన్నారు.