చిత్తూరు జిల్లా పర్యటనలో బిజీబిజీగా గడిపారు పవన్ కల్యాణ్. మదనపల్లెలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని జనసేన నేతలతో భేటీ అయ్యారు. వైసీపీ నేతలు జనసేనను టీడీపీ బీ టీమ్ అని ఆరోపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవకాశ వాద రాజకీయాలు చేయనని అన్నారు. అలా చేయాలనుకుంటే..2019లోనూ టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసే వాడినని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని....వైసీపీ నేతలూ జరజాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. జనసేన తిరగబడితే మీపని అధోగతే అంటూ హెచ్చరించారు.
త్వరలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు పవన్. అవసరమైతే రాయలసీమలో పాదయాత్ర చేస్తానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఆగడాలను ఇకపై సాగనీయమని స్పష్టం చేశారు. అటు తనను పవర్ స్టార్ అంటూ పిలవద్దని అభిమానులకు సూచించారు జనసేనాని.
అంతకుముందు... మదనపల్లి మార్కెట్ యార్డులో టామోటా రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు పవన్. సీఎంకు ఇంగ్లీష్ మీడియంపై ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రైతుల కష్టాలపై చర్చించకుంటే అమరావతిలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. మదనపల్లెలో జరిగిన మహిళా సదస్సులోనూ పాల్గొన్నారు పవన్..సంఘమిత్రల జీతం 3 వేల నుంచి 10 వేలకు పెంచుతామని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది..షెడ్యూల్ ప్రకారం శుక్రవారం కూడా చిత్తూరు జిల్లాలో పర్యటించాల్సి ఉన్నా దాన్ని కుదించుకుని హస్తినకు వెళ్లున్నారు..ఇటీవల తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్షాను కలిసేందుకే వెళ్తున్నట్టు వార్తలు రావడంతో..పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.