పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నారు. రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఫలితంగా శాంతియుతంగా జరగాల్సిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
పలు రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా శనివారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. బీహార్లో ఆర్జేడీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు, ముస్లీంలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రోడ్లపై టైర్లు తగలబెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని.. ఎన్ఆర్సీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బీహార్లోని పలు ప్రాంతాల్లో ఆర్జేడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రైల్వే ట్రాక్లపై ధర్నాకు దిగడంతో పలు రైళ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరొట్టి రైళ్ల రాకపోకలు కొనసాగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరనలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆందోళనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి నిరసన ప్రదర్శన దగ్గర డ్రోన్లతో నిఘా పెట్టారు. 144 సెక్షన్ విధించారు.