అనంతపురం జిల్లా కదిరి రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేపింది. తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ రైలులో బాంబుపెట్టినట్టు సమాచారం అందడంతో మూడు బోగీల్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. బోగీల్లో అనువనువూ తనిఖీ చేసినా.. ఎలాంటి బాంబు లేకపోవడంతో రైల్వే పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తనిఖీల కారణంగా ట్రైన్ గంటన్నర ఆలస్యంగా బయలు దేరింది.
తిరుపతి గుంతకల్ ప్యాసింజర్లోని మూడో బోగీలో బాంబు ఉందని గుంతకల్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే వారు రైల్వే పోలీసులను అలర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కదిరి రైల్వే స్టేషన్కు చేరుకుని.. ప్యాసింజర్ ట్రైన్లో మూడు బోగీల్లో బాంబ్ స్క్వాడ్తో కలిసి తనిఖీలు చేయించారు. ప్రయాణికులను దూరంగా పంపించి ప్రతి సీటును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏం జరుగుతుందో తేలీక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే బాంబు లేదని పోలీసులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.