దిశ కేసులో నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల అంత్యక్రియలు పోలీస్ బందోబస్తు మధ్య ముగిశాయి. ఇక జక్లేర్ గ్రామంలో ఆరిఫ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్కౌంటర్ జరిగిన 17 రోజుల తర్వాత వారి మృతదేహాలకు అంత్యత్రియలు నిర్వహించారు..
నిందితుల మృతదేహాలకు రీపోస్టు మార్టమ్ నిర్వహించాలని.. తెలంగాణ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తెలంగాణ వైద్యులతో కాకుండా.. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ వైద్యులచే నిర్వహించాలని సూచించింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం.. దాదాపు 4 గంటల పాటు నిందితుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించింది. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రీపోస్ట్ మార్టమ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తయింది. మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాతే రీపోస్టుమార్టం పూర్తి చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖ అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టమ్ నిర్వహించారు..
అంతకు ముందు మృతదేహాలకు ఎక్స్రే తీశారు. ఈ ఎక్స్ రేలో.. మహ్మద్ ఆరీఫ్ బాడీలో- 4, జొల్లు శివ బాడీలో-3, జొల్లు నవీన్ బాడీలో -2, చెన్నకేశవులు బాడీలో ఒక బుల్లెట్ గుర్తించినట్టు తెలుస్తోంది. రీపోస్టుమార్టమ్ ప్రక్రియనంతా వీడియో తీసింది ఎయిమ్స్ వైద్యుల బృందం. ఈ వీడియోతో పాటు రీపోస్టుమార్టమ్ పై పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు ఎయిమ్స్ వైద్యుల బృందం...
రీపోస్టుమార్టమ్ ప్రక్రియ హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందన్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్. నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని.. 2 నుంచి 4 రోజులు రీ ఫ్రిజిరేటర్లో పెట్టామని.. మృతదేహాలు 50 శాతానికి పైగా డీ-కంపోజ్ అయ్యాయని డాక్టర్ శ్రవణ్ తెలిపారు...
రీపోస్టుమార్టమ్ పూర్తయిన తర్వాత నాలుగు మృతదేహాలను పోలీసులు.. వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. డెడ్ బాడీస్ అప్పగించే ముందు కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకున్నారు. అనంతరం.. సోమవారం రాత్రే.. ఈ నాలుగు మృతదేహాలకు వారివారి గ్రామాల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు.