పవన్ రాజధాని పర్యటన.. తీవ్ర ఉద్రిక్తత

Update: 2019-12-31 09:10 GMT

జనసేన అధినేత పవన్‌ రాజధాని పర్యటన‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మొదట వెంకటపాలెం తరువాత మందడంలోని పవన్‌ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. రాజధానిలో ఆంక్షలు ఉన్నాయంటూ రాజధాని రైతులతో కలవకుండా అడ్డుపడ్డారు. అప్పటికే వెంకటపాలెం చేరుకున్న జనసైనికులు, రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా వేసిన ముళ్ల కంచెలను తొలగించి జనసేన కార్యకర్తలు ముందుకు దూసుకువచ్చారు. దీనిపై స్పందించిన పవన్.. కార్యకర్తలను సముదాయించి.. వాహనాలకు అనుమతి లేకపోతే.. నడుచుకుంటూ మందడం చేరుకుంటామని చెబుతూ.. వాహనం దిగి కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా నడుచుకుంటూ మందడం బయలుదేరారు.

పోలీసులను దాటుకుని పవన పర్యటన కొనసాగినా తరువాత మందడంలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. జనసేనాని పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి పవన్‌ను ముందుకు కదలకుండా చేశారు. రైతులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పవన్‌ కోరినా పోలీసులు వినలేదు. దీంతో అక్కడే ఆయన బైఠాయించి పవన్‌ నిరసన తెలిపారు.

అయితే తరువాత సచివాలయం నుంచి సీఎం జగన్‌ వెళ్లిపోవడంతో పోలీసులు అంక్షలు సడలించారు. దీంతో పవన్ అక్కడ నుంచి లేచి రైతులతో మాట్లాడేందుకు ముందుకు వెళ్లారు.

Similar News