న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో డిసెంబర్31 న ట్రాఫిక్ అంక్షలు కొనసాగనున్నాయి. అర్థారాత్రి 1 గంటల వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిస్తారు. తరువాత వేడుకలు నిర్వహించినా.. రోడ్లపై గుంపులుగా కనిపించినా.. వాహనాలు నడిపినా.. గ్రూపుగా చేరి సందడి చేసినా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మందుబాబుల భరతం పట్టేందుకు ప్రత్యేక డ్రంక్ డ్రైవ్లు నిర్వహించనున్నారు.. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ అంక్షలను ఇంకాస్త కఠిన తరం చేశారు. మందు బాబుల ఆటకట్టించేందుకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేయనున్నారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతిస్తారు.
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసెస్లను ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్లో ఎక్కువగా ఈవెంట్స్, పబ్లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఏడాది ప్రతి ఈవెంట్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.