ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారిస్తే ఎలా: చంద్రబాబు

Update: 2020-01-15 10:52 GMT

 

రాజధాని ప్రజలు పండుగ జరుపుకోకుండా చేసిన సీఎం జగన్‌ది పైశాచిక ఆనందమేనని ఆరోపించారు చంద్రబాబు. రైతులు ఇబ్బందులు పడుతుంటే, సీఎం జగన్ ఎడ్లపందాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన మహిళలపై దాడులు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వెలగపూడి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రైతులకు ధైర్యం చెప్పారు. చంద్రబాబు వెంట.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు.

రాజధాని మార్చే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామంటే ఎలా అని నిలదీశారు. అమరావతి ముంపు ప్రాంతం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఇక్కడ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలమని అన్నారు. తాను కట్టిన ఏసీ రూముల్లో ఉంటూ.. అసలు నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు.

Similar News