రేపు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళంలోని టీడీపీ నేత కూన రవికుమార్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కూన విజయవాడ బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన్ని నిర్బంధించారు. తన కుమార్తె స్కూల్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్తున్నామని రవి కుమార్ చెప్పిన పోలీసులు వినలేదు. దీంతో పోలీసులు, కూన రవికుమార్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అడ్డుకోవడంపై కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని ఆరోపించారు.
అటు తిరుపతిలోనూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన సుగుణమ్మను, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.