సేవ్ అమరావతి అనే నినాదం 42 రోజులుగా మారుమోగుతోంది. మహాధర్నాలు, ర్యాలీలు, రిలేదీక్షలు ఇలా ఎన్ని రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మనసు కరగలేదు. రాజధాని మార్పు విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. బిల్లును మండలి అడ్డుకుందనే కారణంతో మండలినే పూర్తిగా రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు సీఎం జగన్. దీంతో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని రాజధాని రైతులు నిర్ణయించారు.
నిరసనల్లో భాగంగా మంగళవారం రాయపూడిలో రైతులు జల దీక్ష చేపట్టారు. వృద్ధులు, మహిళలు అని తేడా లేకుండా అంతా నీటిలోకి దిగి నినాదాలు చేశారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. కొందరు నీటిలోనూ ఆసనాలు వేసి నిరసన తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం మారే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామంటున్నారు రాజధాని రైతులు.