అమరావతి నుంచి కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు, రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగా.. కార్యాలయాలను ఎలా తరలిస్తారని ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణంతో కార్యాలయాలను తరలిస్తున్నారని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలు తరలించవద్దని మౌఖిక ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలా తరలించారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అయితే.. ఇది ప్రభుత్వ నిర్ణయమని ఏజీ చెప్పారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో సరిపడా స్థలం లేదని.. పాలనా సౌలభ్యం కోసమే కార్యాలయాలు తరలిస్తున్నామని చెప్పారు. అయితే.. స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో.. కౌంటర్ ఫైల్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్పై మధ్యాహ్నం కోర్టు విచారించనుంది. దీనిపై ఎదో ఒక నిర్ణయం వెల్లడిస్తానని న్యాయమూర్తి అన్నారు.
సోమవారం న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై మరో రెండు లంచ్మోషన్ పిటిషన్లు వేశారు. మొత్తం మూడు పిటిషన్లను మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారించనుంది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.