ఢిల్లీలో రాజధాని రైతుల పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న రాజధాని రైతులు ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి తమ గోడు మొరపెట్టుకున్నారు. బుధవారం మరికొందరి కేంద్రమంత్రులతోపాటు, వివిధ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును రైతులు కలిశారు. అమరావతి రాజధానికి మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను అధిష్టానం దృష్టిలో పెడతానని కేవీపీ హామీ ఇచ్చారు. రాజధాని ఆందోళలపై పార్టీలో చర్చించి.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇప్పటి వరకు తాము కలిసిన అంతా అమరావతిపై స్పష్టమైన హామీ ఇచ్చారు అన్నారు రాజధాని రైతులు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఆందోళన ఆగదన్నారు. కుదిరితే రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.