ఏదైనా రావడం ఎంత ఈజీనో.. అదే తగ్గించాలంటే ఎంతకష్టమో.. నిజం గడప దాటకముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందని ఊరికే అనలేదు. ఎక్కడో దూరాన ఉన్న చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. భారతదేశంతో పాటు మిగిలిన దేశాలన్నీ తమకి కూడా ఎక్కడ అంటుకుంటుందో అని వణికిపోతున్నాయి. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఈ వైరస్ బారిన పడ్డ రోగులు ఒకటి అరా అయినా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిందో లేదో తెలియదు కానీ వెల్లుల్లిని వేడినీళ్లలో మరిగించి ఆ నీటిని తాగితే కరోనా కనిపించకుండా పోతుందనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ట్విట్టర్ నుంచి ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. కానీ అదే మందనుకోవడం మాత్రం పొరపాటు.