పర్యటనకు ముందే ఇండియాకు షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

Update: 2020-02-19 12:46 GMT

పర్యటనకు ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇండియాకు షాకిచ్చారు. భారత్‌ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూనే ఈ పర్యటనలో ఎలాంటి ధ్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు ఉండవని స్పష్టం చేశారు. భారత్‌ తో ట్రేడ్‌ డీల్స్‌ కు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. ట్రంప్‌ ఈ నెల 24న భారత్‌కు వస్తుండటంతో ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ... ట్రంప్‌ వ్యాఖ్యలతో ఒప్పందంపై సందేహాలు నెలకొన్నాయి.

లైట్‌ హైజర్‌ నేతృత్వంలోనే భారత్‌లో అమెరికా వాణిజ్య చర్చలు జరిగాయి. అయితే.. ట్రంప్‌ బృందంలో ఆయన ఉండరనే ప్రచారం జరుగుతోంది. లైట్‌ హైజర్‌ లేకపోవడం, ఇప్పట్లో కుదిరే అవకాశం లేదన్న ట్రంప్‌ వ్యాఖ్యలు చూస్తే... ఈ డీల్‌ జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే... పూర్తి స్థాయి ఒప్పందం కుదరకపోయినప్పటికీ... పాక్షిక ఒప్పందం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇరుదేశాలు పెంచిన టారిఫ్‌లే ఒప్పందం ఖరారులో చిక్కుముడిగా మారినట్లు తెలుస్తోంది.

Similar News