మంత్రి అవంతి వ్యాఖ్యలపై టీడీపీ నేత పట్టాభి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ఛాలెంజ్ చేసే స్థాయి అవంతికి లేదన్నారు. ఓ బంతిలా దొర్లుకుంటూ పార్టీలు మారే అవంతిని త్వరలోనే ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ పట్టాభి ఫైర్ అయ్యారు. గురువారం విశాఖ ఎయిర్ పోర్టుకు ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించారనే విషయాలను ఇప్పటికే టీడీపీ బయటపెట్టిందని.. భవిష్యత్తులో మరికొన్ని వాస్తవలు వెల్లడిస్తామన్నారు.
పీపీఏలపై సీఎం జగన్ నిర్ణయంతో దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారని పట్టాభి గుర్తు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కారణంగా దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారుతోందని ఆయన అన్నారని.. ఇలా అయితే పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయని పట్టాభి ప్రశ్నించారు. జగన్ పాలనతో ఏపీ ప్రజలు తల దించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.