అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కేసీఆర్ దార్శనికత తెలంగాణను అభివృద్ధివైపు నడిపిస్తోందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన గవర్నర్.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్రప్రగతిని వివరించారు.
అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఇవ్వని విధంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు గవర్నర్ తమిళిసై. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామని.. త్వరలో కొత్త భూపరిపాలన విధానానికి శ్రీకారం చుట్టబోతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రైతు బంధు గొప్ప పథకమని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం గర్వకారణమన్నారు గవర్నర్ తమిళిసై. రైతు బీమాతో అన్నదాత కుటుంబాలకు ధీమా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితిలను ఇకపై రైతు బంధు సమితిలుగా నిర్ణయించామని తెలిపారు. రైతు విత్తనం వేసినప్పటి నుంచి మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చేవరకు..రైతు బంధు సమితిలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.