విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఓ ప్రైవేట్ స్కూల్ యజమాన్యం వక్రబుద్ధి చూపించింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్ధుల పట్ల కర్కశత్వం ప్రదర్శించింది. ఇద్దరు చిన్నారులను తరగతి గదిలో బంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శృంగవరపుకోటలోని రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం ఈ దారుణానికి ఒడిగట్టింది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న ఇద్దరు చిన్నారులను స్కూల్లో నిర్బంధించారు. విషయం వెలుగుచూడడంతో.. పాఠశాల యాజమాన్యంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎమైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ నిలదీస్తున్నారు. ఫీజు వసూలు కోసం.. విద్యార్ధుల పట్ల ఇలానే వ్యవహరిస్తారా అంటూ మరోవైపు పాఠశాల యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.