తెలంగాణను కరోనా వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. ఏం చేయాలి..? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఇంకా ఎలాంటి ఆంక్షలు విధించాలి..? ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలి..? తదితర అంశాలపై ఈ సమావేశంలో సూచనలు చేయనున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో దావానంలా విస్తరిస్తుండడంతో.. దానిని అరికట్టేందుకు అత్యవసరంగా తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకాస్త అప్రమత్తమైంది. కరోనాను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకడంతో.. విమానాశ్రయాల్లో వారికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలనీ, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని సీఎం తెలిపారు.
మరోవైపు వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే వైద్యాధికారులు, ఇతర జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. కరోనా కట్టడి చేయడానికి ఇంకా ఏం చేయాలన్ని అన్నిదానిపై పూర్తి వివరాలు సేకరించారు.. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు..
కరోనాను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, మంత్రులు.. కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా రెడ్డి, మల్లారెడ్డి తదితరులు హాజరవనున్నారు.