కరోనా కట్టడికి లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పలు వర్గాల ప్రజలు ఎదురొంటున్న సమస్యలను వివరిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. రైతులు, కార్మికులు, ఎంఎన్ఆర్ఈజీఏ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని ఆదుకోవాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం కింద వర్కర్లకు రేషన్ అందజేయటం అభినందనీయమని ఆమె అన్నారు. అయితే వారికి ఆర్థిక సాయం కూడా అందజేయాలని కోరారు. ఈ ఆపత్కార సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరమని.. ఆ లేఖలో ప్రియాంక సూచించారు. అకాల వర్షాల వలన పంటలు కోల్పోయిన రైతులకు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే అందజేయాలని ఆమె కోరారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా నిత్యావసర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రియాంక గాంధీ కోరారు.