ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.5 వేలు జమ
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్ కట్టడిని చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఈ నేఫథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న ఆటోరిక్షా, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్లకు ఢిల్లీ ప్రభుత్వం సాయమందిస్తోంది. డ్రైవర్ల కుటుంబానికి రూ.5 వేల చొప్పున ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేస్తోంది.
ఆటోరిక్షా, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల నుంచి ఆర్థిక సాయం కింద 1.6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. ఇప్పటివరకు 23వేల మంది డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశామని వివరించారు. మరో 20వేల మంది డ్రైవర్లకు కూడా నగదు పంపిణీ చేస్తామని ఆయన పేర్కోన్నారు.