దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది .. ఢిల్లీ వీధుల నుంచి రాష్ట్రపతి భవన్కూ ఈ మహమ్మారి పాకింది. రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో పారిశుద్ధ్య కార్మికుడి కి కూడా వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తిని సమీపంలోని బిర్లా మందిర్ కాంప్లెక్స్లోని దిగ్బంధం కేంద్రానికి పంపారు.
కాగా పాజిటివ్ గా తేలిన వ్యక్తి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడం తోపాటు.. ఆ పరిసరాల్లో సుమారు 25 ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను కూడా ముందు జాగ్రత్త చర్యగా వేరుచేయాలని నిర్ణయించారు. వీరందరికీ సామాజిక దూర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి. కాగా ఇంతకుముందే పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబంలో ఒకరు వైరస్ కారణంగా మృతి చెందారు.