దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినేట్ సెక్రటరీ రాజీవ్ గాబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. అయితే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తామని తమకు అనుమతి ఇవ్వాలని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని షాపులు తెరుచుకునేందుకు వెసలుబాటు కల్పించింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. తాము ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్రమే అని అన్నారు. కట్టింగ్ షాపులు, సెలూన్లు ఓపెన్ చేసేందుకు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కొత్త ఆదేశాల ప్రకారం రెస్టారెంట్లు కూడా తెరవడానికి వీలు లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చు అని తెలిపారు. షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీలులేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో, కంటోన్మెంట్ జోన్లను మినహాయిస్తే, మిగితా ప్రాంతాల్లో షాపులు తెరుచుకునే అవకాశం కల్పించామన్నారు. ఇక మద్యం దుకాణాలు ఓపెన్ చేయాలని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది.