తెలంగాణలో రాగల 48 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అయితే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వానలు కురిశాయి.
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి ఉత్తర ఈశాన్యదిశగా అండమాన్, నికోబార్దీవుల తీరం వెంట ఏప్రిల్ 30 నుంచి మే మూడో తేదీ మధ్య మయన్మార్ తీరం వద్ద కేంద్రీకృతమయ్యే వీలున్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాగల 48 గంటల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.