అగ్ర రాజ్యాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉందని అనుకుంటున్న తరుణంలో దేశంలో కూడా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు చూసిన లెక్క ఒక ఎత్తైతే శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదు కావడంతో పాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 19,358 కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12 వేలు దాటగా పుణెలో 2,700 కేసులు నమోదయ్యాయి. తరువాతి స్థానాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్లో మరణాల రేటు అధిక స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడులో వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.