రాజధాని తరలింపుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాజధానికి సంబంధించి చట్ట సభల్లో పెండింగ్లో ఉన్న బిల్లుల వ్యవహారం తేలిన తర్వాతే.. రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉందని.. ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఇళ్ల స్థలాల అంశంపై విచారణను నిలిపివేయాలని.. కౌంటర్లో ప్రభుత్వం కోరింది. రాజధాని తరలింపుపై సచివాయల ఉద్యోగులు సమావేశమైన విషయం ప్రభుత్వానికి సమాచారం లేదని.. ఏపీ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది.
ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపు అంశాన్ని అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పిటిషనర్ ఆరోపణ. ఇప్పటికే ఫర్నిచర్ను విశాఖలోని గ్రేహౌండ్ కాంపౌండ్కు తరలించాలని పిటిషనర్ తెలిపారు. ఈ నెల 28న సెక్రటేరియట్ను విశాఖకు మార్చేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారన్నది పిటిషనర్ వాదన